Agreements with America are a loss for our farmers
ఉద్యమాలు చట్టాలు పత్రికా ప్రకటనలు వార్తలు

అమెరికాతో ఒప్పందాలు మన రైతులకు నష్టం

నిరసనలో పాల్గొన్న వివిధ సంఘాల నాయకులు

గుంటూరు : అమెరికా ఉపాధ్యక్షులు జెడి వ్యాన్స్‌ పర్యటనను నిరసిస్తూ గుంటూరులో భగత్‌సింగ్‌ సెంటర్‌ వద్ద ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సమన్వయ సమితి, రైతు సంఘం సీనియర్‌ నాయకులు వై.కేశవరావు మాట్లాడుతూ అమెరికా ఉత్పత్తులు భారతదేశానికి దిగుమతి చేస్తే ఇక్కడున్న రైతులు నష్టపోవటమే కాకుండా ఉపాధి కోల్పోయి వీధిన పడతారన్నారు. పైగా భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న వ్యవసాయ ఉత్పత్తులపై పెద్ద ఎత్తున సుంకాలు విధించడం భారత వ్యవసాయానికి తీవ్ర నష్టమని చెప్పారు. భారత రైతులకు నష్టం చేసే ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి. ప్రసాద్‌ మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన టారీఫ్‌ల వల్ల భారత ప్రజలకు తీవ్రనష్టం కలుగుతుందని, వ్యవసాయ రంగం దెబ్బతింటుందని, అమెరికాతో ఒప్పందాలేమీ చేసుకోవద్దని డిమాండ్‌ చేశారు. రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ భారతదేశంలో రైతులు పండిస్తున్న పంటల ధరలను దెబ్బతీసే విధంగా అమెరికా నుండి వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతికి అనుకూలంగా మోడీ ప్రభుత్వం సిద్ధపడటం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజరుకుమార్‌, వివిధ సంఘాల నాయకులు జి.ఈశ్వరయ్య, డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌, వై.రాధాకృష్ణ, కె.అజరు కుమార్‌, జమలయ్య, ఎం.వెంకటరెడ్డి, ఎం.హరి ప్రసాద్‌, వి.నరసింహారావు పాల్గొన్నారు

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *