రైతులకు పరిహారం చెల్లించాలి
విజయనగరం టౌన్ : జాతీయ రహదారి-516బి పెందుర్తి నుండి బొడ్డవర, ఎస్.కోట, కొత్తవలస బై పాస్ రోడ్డు లోభూములు కోల్పోతున్న రైతులకు 2013 భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తూ రైతుసంఘాల ఆధ్వర్యాన సోమవారం కలెక్టరేట్ వద్ద రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి బి.రాంబాబు, నాయకులు ఎం.రమణ, గొంప కృష్ణమూర్తి మాట్లాడుతూ పెందుర్తి నుంచి బొడ్డవరకు వరకు చేపడుతున్న భూసేకరణలో ఎస్.కోట మండలం వెంకట రమణ పేట, కొత్తూరు, ఎస్.కోట, సీతంపేట గ్రామాలు సన్న, చిన్న కారు రైతులకు ఉన్న కొద్దిపాటి భూమిని కోల్పోతున్నారని తెలిపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువలో కూడా అనేక మంది రైతులు భూమి మొత్తం కోల్పోయి జీవనాధారం కోల్పోతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇస్తామంటున్న పరిహారంతో కోల్పోయిన భూమిలో 30శాతం భూమి కూడా రాదన్నారు. ఎస్.కోటలో ఇప్పుడు వున్నరోడ్డు వెడల్పు చేసుకుంటే ప్రతిపాదిత రోడ్డుకు ఎంక్రోచ్ మెంట్లు తొలగించి న భూసేకరణ చేయకుండా రోడ్డు వెడల్పు సరిపోతుం దన్నారు. ప్రత్యామ్నాయ రోడ్డునుమార్చే విధంగా చేయాలని, లేదంటే మెరుగైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్త్రుత మార్కెట్ విలువకు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ విలువకు 5 నుండి 10రెట్లు వ్యత్యాసం వున్నందున, ప్రవేటు మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకొని 2013 భూసేకరణ ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరారు. అమెరికా ఉపాధ్యక్షుడి పర్యటనను వ్యతిరేకిస్తూ ప్రజాసంఘాల నిరసనఅమెరికా ఉపాధ్యక్షుడు జెడి వ్యాన్స్ భారత పర్యటనను నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద రైతు సంఘం ఆధ్వర్యాన సోమవారం నిరసన తెలిపారు. జెడి వ్యాన్స్ గో బ్యాక్, భారత దేశం అమ్మకానికి సిద్ధంగా లేదు, దేశాన్ని కాపాడుకోవాలి అంటూ నినాదాలు చేశారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.రాంబాబు మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలకు తలొగ్గి అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు మన దేశంలో దిగుమతి సుంకాలను తగ్గించాలనే ప్రణాళికతో ముందుకు సాగుతున్నారన్నారు. భారత ప్రధాని మోడీ దేశ రైతులు, ప్రజలకు నష్టం కలిగించే ఒప్పందాలకు పూనుకుంటూ ద్రోహం చేస్తున్నారని, ఇప్పటికైనా దేశ ప్రయోజనాలు కాపాడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు లోకవరపు అది నారాయణ మూర్తి, జిల్లా సహాయ కార్యదర్శి మద్దిల రమణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గాడు అప్పారావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్, సిఐటియు నాయకులు ముత్యాలు, రైతు సంఘం జిల్లా నాయకులు తమ టాపు పైడి నాయుడు, గంగు నాయుడు, తదితరులు పాల్గొన్నారు