మే 20న జరుగు దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి – కార్మిక, కర్షక సంఘాల పిలుపు
సమ్మె జయప్రదానికై ప్రాతూరులో సన్నాహక సమావేశం.
కార్మికులు పోరాడే సాధించుకున్న కార్మిక చట్టాలు అమలు చేయాలని, నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలని, కనీస వేతనం 26000 అమలు చేయాలని కోరుతూ, ఈనెల 20వ తేదీన దేశవ్యాప్త మైన జయప్రదం చేయాలని కోరుతూ, ఏపీ రైతు సంఘం తాడేపల్లి మండల నాయకులు ముసునూరు సుహాస్ అధ్యక్షతన ఎంటీఎంసీ పరిధిలోని ప్రాతూరు గ్రామంలోని సిపిఎం కార్యాలయం వద్ద కార్మిక కర్షక సంఘాల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం శనివారం సాయంత్రం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఏపీ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కార్మికుల పొట్ట కొట్టే విధంగా కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చి కార్మికుల హక్కులను కాల రాసిందన్నారు. వ్యవసాయ రంగాన్ని నెరవేరం చేసే విధంగా దేశవ్యాప్తంగా రైతాంగాన్ని ఇబ్బందులు పాలు చేసే విధంగా మూడు నల్ల చట్టాలను బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఒకవైపున ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ చట్టాలు చేయడం దుర్మార్గమన్నారు. కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ కేంద్ర బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మే 20న జరుగు సమ్మెలో కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. సిఐటియు తాడేపల్లి మండలం నాయకులు పల్లె కృష్ణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతన చట్ట ప్రకారం 26 వేల రూపాయలను కార్మికులకు వర్తింప చేయకుండా ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు. ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయకుండా, కార్మికులకు భద్రత కల్పించకుండా కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం విధానాలను అన్ని వర్గాల కార్మిక, కర్షక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని ఆయన అన్నారు. కార్మికుల శ్రమను కార్పొరేట్లకు దోచిపెడుతున్న బిజెపి ప్రభుత్వ విధానాలను పోరాటాల ద్వారానే తిప్పి కొట్టాలన్నారు. ఏఐటీయూసీ తాడేపల్లి ప్రాంత ఏరియా నాయకులు కంచర్ల కాశయ్య మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలంబిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగే సమ్మెలో కార్మికులతో పాటు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సును అమలు చేయకుండా రైతు వ్యతిరేక చట్టాలు తీసుకురావడం యావత్తు రైతాంగం వ్యతిరేకిస్తుందని ఆయన అన్నారు. రైతు సంఘం తాడేపల్లి మండల నాయకులు దొంతి రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కార్మికుల పోరాడే సాధించుకున్న 29 కార్మిక చట్టాలను తుంగలో తొక్కి, కాషాయీకరణ ప్రైవేటీకరణ పేరుతో కార్మికులను రైతులను ఇబ్బందులు పెట్టే కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కార్మికులు పోరాడి సాధించుకున్న, ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు అమ్మిశెట్టి రంగారావు, సిఐటియు నాయకులు నాగ పోగు విజయరాజు, చొక్కా మరియదాసు, పుల్లగూర సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.