Skip to content
విజయనగరం : రైతు ఉత్పాదక సంఘాల ద్వారా ఉత్తరకోస్తాలో విత్తనాభివృద్ది చేయాలని వ్యవసాయ పరిశోధనా సంచాలకులు డాక్టర్ పివి సత్యనారాయణ చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతున్న ఉత్తరకోస్తా పరిశోధన, విస్తరణ సలహామండలి సమావేశంలో రెండో రోజు మంగళవారం విత్తన అభివృద్ధిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ, ఉత్తరకోస్తా జిల్లాల్లో ముఖ్యంగా అనకాపల్లి, విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కావలసిన వరి, నువ్వులు, వేరుశెనగ, గోగు, కట్టె జనుము, చిరుధాన్యాలకు రైతులే ఉత్పత్తి దారుల సంఘాలుగా తయారై, విత్తనాభివద్ది చేసుకొని అవసరమైన విత్తనం తయారు చేసుకోవాలని సూచించారు. చిన్న చిన్న కమతాలకు జపాన్, చైనా పనిముట్ల నమూనాలు, యాంత్రికరణ వాడాలన్నారు. అనంతపురం నుంచి వచ్చిన డాక్టర్ విజయశంకబాబు మాట్లాడుతూ, జిల్లాలలో ఉన్న చెరువులన్నిటి నుండి చెరువు మట్టిని పొలంలో వాడాలని సూచించారు. నేలలో చిసెల్ నాగలితో వేసవి దుక్కులు దున్నాలని చెప్పారు. రాష్ట్ర వరి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ యు.గిరిజారాణి మాట్లాడుతూ, సన్న రకాలు, మద్యస్థ మినికిట్ రకాలు ఆర్జిఎల్ 7034, 7039 రానున్న రోజుల్లో రాగోలు పరిశోధనా స్థానం నుండి అందుబాటులోకి వచ్చే అవకాశముందని తెలిపారు. పచ్చిరొట్ట ఎరువు వేసి మాత్రమే తొలకరిలో పరి సాయం చేయాలని సూచించారు. సదస్సులో రాష్ట్ర స్థాయి పప్పు జాతుల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి. మోహన్ రెడ్డి, నూనెగింజలు ప్రధాన శాస్త్ర వేత్త డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆయా పంటల దిగుబడి పెంచేందుకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి విటి రామారావు, వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ పాత్రో, డాక్టర్ కె.లక్ష్మణ, నాలుగు జిల్లాల నుంచి ఎడిఎలు, వ్యవసాయ,అనుబంధరంగాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Like this:
Like Loading...
Related