వాణిజ్య వ్యవసాయం

కొనుగోళ్లు లేక ‘బర్లీ’ రైతు బెంగ

కొనుగోళ్లు లేక ‘బర్లీ’ రైతు బెంగ

మంగళ సూత్రాలను తాకట్టు పెట్టాను. ఎరువులు, పురుగు మందులు అన్నీ అప్పులే. చివరికి చెవి దిద్దులు, ముక్కుపుడక తాకట్టు పెట్టి కూలి డబ్బులు ఇచ్చాము. ప్రతి సంవత్సరం కొంతమంది కూలీలు కూడా డబ్బులు ఇవ్వలేక మొహం చాటేస్తున్నాం. తాకట్టు పెట్టిన బంగారం వెంటనే విడిపించుకోకపోతే బంగారం ఇచ్చేదిలేదని తాకట్టు పెట్టుకున్న వ్యాపారి కబురు చేశారు. ఇళ్లల్లో పొగాకు, రోడ్ల మీద మనుషులు, పశువులు, జీవాలు…! ఇవి బాపట్ల జిల్లా పర్చూరు, ఇంకొల్లు మరికొన్ని చుట్టుపక్కల మండలాల్లోని గ్రామాలన్నిటిలో బ్లాక్‌ బర్లీ పొగాకు సాగు చేసిన రైతుల పరిస్థితి.

రాష్ట్రంలో దాదాపు లక్ష ఎకరాలకు పైగా నల్ల బర్లీ పొగాకు వేశారు. వీరిలో 80 శాతం పైగా కౌలు రైతులే ఉన్నారు. గత రెండు సంవత్సరాల్లో తెగుళ్లు వచ్చి మిర్చి వేసిన రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు గత సంవత్సరం నల్ల బర్లీ పొగాకు పంట క్వింటా రూ.15 నుండి రూ.18 వేలకు అమ్ముడుపోయింది. చివరకు అడుగులు (నాసిరకంగా వున్నా) కూడా రూ.12 వేలకు బంగారం లాగా వ్యాపారులు కళ్ళకు అద్దుకుని కొనుక్కుపోయారు. అలాగే జి.పి.ఐ, ఐ.టి.సి తదితర కంపెనీల ప్రతినిధులు, వ్యాపారులు ఒకటికి నాలుగు సార్లు గ్రామాలకు, రైతుల చుట్టూ తిరిగి మొత్తం పొలమంతా నల్ల బర్లీ పొగాకు వేయమని ప్రోత్సహించారు. ‘కొంత నల్ల బర్లీ, మరికొంత వైట్‌ బర్లీ పొగాకు లేదా మిర్చి వేస్తారేమో…అలా వేయొద్దు. మొత్తం నల్ల బర్లీ వేయండి’ అని చెప్పారు. పైగా గత సంవత్సరం రేటు మరో రెండు మూడు సంవత్సరాలు నిలకడగా ఉంటుందని వ్యాపారులు వారికి భరోసా ఇచ్చారు. దానితో కౌలు రేట్లు పెరిగినా లెక్క చేయకుండా పొలాన్ని కౌలుకు తీసుకున్నారు.

రెగ్యులర్‌గా కౌలు చేసే వారే కాకుండా ఈ మధ్యకాలంలో సంచార జాతులుగా చెప్పుకునే యానాది, ఎరుకల తదితర సామాజిక తరగతులకు చెందిన పేదలు కూడా పొలాలు కౌలుకు తీసుకుని పొగాకు సాగు చేశారు. పంట బాగా పండితే గత సంవత్సరం లాగా ధర వస్తే అప్పులన్నీ తీర్చుకోవచ్చు. అప్పుల నుండి బయటపడి ఊపిరి పీల్చుకుందామనుకున్నారు. కానీ నల్ల బర్లీ పొగాకు వేసిన రైతులు, కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది. కౌలు రేట్లు రూ.25 వేల నుండి రూ.35, 40 వేల వరకు పెరిగింది. పొగాకు గుచ్చటానికి రూ.40 వేలు, ట్రాక్టర్‌తో దుక్కికి రూ.10 వేలు, ఎరువులకు రూ.10 వేలు అవుతోంది. 75 సంవత్సరాల స్వాతంత్య్రానంతరం కూడా పంట పండించుకోవడానికి నీళ్లకు కనీసం రూ.10 వేల రూపాయలు ఖర్చు చేశారు. ఎద్దులతో సాళ్ళ ఏర్పాటుకు రూ.5000, నారుకు రూ.పది వేలు ఇతరత్రా అన్నీ కలుపుకుని ఎకరాకు సాగు చేయడానికి రూ.1,50,000 పైనే ఖర్చు అయింది. గత సంవత్సరం ఎకరాకు సరాసరిన 18 క్వింటాళ్ల పొగాకు దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం ఖర్చులు పెరగడంతో పాటు దిగుబడి కూడా తగ్గింది. ఈ సంవత్సరం సగటున పది నుండి 13 క్వింటాళ్ళ దిగుబడి ఉంటుందని రైతులు అంచనా వేస్తున్నారు.
గత సంవత్సరం అత్యంత ఎక్కువ ధర పొందిన నల్ల బర్లీ పొగాకు రైతుల పరిస్థితి తారుమారైంది. గత సంవత్సరం క్వింటా రూ.18,000 ధర వస్తే నేడు అదే పంట కేవలం రూ.3000 మాత్రమే ధర పలుకుతున్నది. కొన్ని ప్రాంతాలలో అసలు కొనలేమని ప్రకటించి వ్యాపారులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో పొగాకును పరిశీలించి నాణ్యత, తేమ శాతం అన్నీ సక్రమంగా ఉన్నాయని పాస్‌ చేసి మళ్లీ తిరస్కరిస్తున్నారు. జనవరి నుండి బ్లాక్‌ బర్లీ పొగాకు కొనుగోళ్లు ప్రారంభం కావటం ఆనవాయితీ. కానీ ఈ సంవత్సరం ఆ ఆనవాయితీ దాటి 120 రోజులు గడిచినా పట్టించుకునే దిక్కుమొక్కు లేక రైతులు పొగాకు ఎలా అమ్ముకోవాలా అని ఎదురు చూస్తున్నారు. కంపెనీలు, దళారులు కుమ్మక్కై బ్లాక్‌ బర్లీ పొగాకు సాగు చేసిన రైతులను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారు. మీరు ఆందోళన చేస్తే ధర మరింత తగ్గుతుంది. కొనటం ఇంకా ఆలస్యం అవుతుందని కంపెనీల ఏజెంట్లతో ప్రచారం చేయిస్తున్నారు.
పర్చూరు మండలం చిన్న నందిపాడు గ్రామంలో పంట రుణాలు కట్టాలంటూ బ్యాంక్‌ అధికారులు లాయర్‌ నోటీసులు పంపించారు. ఐదుగురు సభ్యులున్న జాయింట్‌ లయబిలిటీ గ్రూపు రూ.2.5 లక్షలు అప్పు తీసుకుంటే… నేడు అసలు, వడ్డీ కలిపి రూ.4.74 లక్షలైంది. కట్టకపోతే కోర్టుకు ఈడుస్తామని న్యాయవాదులతో నోటీసులు పంపించారని ఆ గ్రామ కౌలు రైతులు సింగారావు, కోట మరియదాసు, కట్టా సూర్యం తెలిపారు. చెవి పోగులు, ముక్కు దిద్దులు, మెడలో ఉన్న మంగళ సూత్రాలు తాకట్టుపెట్టి కూలి డబ్బులు చెల్లించామని దగ్గుపాడు గ్రామస్తులు ఫకీర్‌ సాహెబ్‌, పెద్ద సుబ్బయ్య చెప్పారు. అయితే తాకట్టు పెట్టుకున్న వ్యాపారి గడువు అయిపోతున్నదని వెంటనే డబ్బులు కట్టి బంగారం విడిపించుకోకపోతే మీ బంగారం మీకు దక్కదని వ్యాపారులు కబురు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కొంత పొగాకు, కొంత మిర్చి వేసే వాళ్ళం. ఏదో ఒక పంట ముందు అమ్ముకుని కూలి డబ్బులిచ్చి అప్పులు కొంతైనా తీర్చుకునే వాళ్ళం. కంపెనీ వాళ్ళు చెప్పిన మాట నమ్మి అంతా బ్లాక్‌ బర్లీ పొగాకు వేసి కూలి డబ్బులు కూడా ఇవ్వలేకపోతున్నాం. అప్పుల వాళ్ళు మీద పడుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నామని వంకాయలపాడు గ్రామానికి చెందిన రామలింగారెడ్డి వెంకట్రెడ్డి, కొండయ్య, రఘు, మురళి తదితరులు దిగాలుగా చెప్పారు.
ఈ పరిస్థితికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల కోసం బడ్జెట్లో కేటాయింపులు సున్నా చేయటం. అలాగే కంపెనీలు కుమ్మక్కై ధరలు పడవేయటం. కంపెనీల మాయాజాలాన్ని కంట్రోల్‌ చేయాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంపెనీలకు తలొగ్గాయి. పొగాకు సాగు చేసిన రైతుల్ని పట్టించుకోలేకపోయాయి. కంపెనీలకు అవసరమైన అనేక సౌకర్యాలను ప్రభుత్వాలు అందిస్తున్నాయి. పంటలు సాగు చేస్తున్న రైతులకు కౌలు రైతులకు హామీ ఇచ్చినట్లు అన్నదాతా సుఖీభవ డబ్బు రూ.20 వేలు రైతుల ఖాతాల్లో నేటికీ జమ చేయలేదు. పాత కౌలు చట్టాలను రద్దు చేసి కొత్త కౌలు చట్టం తీసుకొచ్చి కౌలు రైతులకు రక్షణగా ఉంటామన్న హామీ ఇంతవరకు ఆచరణ రూపం దాల్చలేదు. పాత ప్రభుత్వం టెక్నాలజీని సరిగా ఉపయోగించలేదని పంటను కాపాడుకోవడానికి అవసరమైన పరికరాలు, పరదాలు ఏమీ ఇవ్వలేదు. అవన్నీ ఇచ్చి రైతన్నను ఆదుకుంటానన్న హామీ నీటి మీద రాతగానే ఉండిపోయింది. పొగాకు పండించిన రైతులను ప్రభుత్వాలు గాలికి వదిలేశాయి. అన్ని రకాల పొగాకు పంటలను పొగాకు బోర్డు పరిధిలోకి కేంద్రం తీసుకురాలేకపోవడంతో ప్రభుత్వాలు కంపెనీలను నియంత్రించటం కాకుండా కంపెనీలే ప్రభుత్వాలను, మంత్రులను కంట్రోల్‌ చేస్తున్నాయి. ఫలితంగా ఈ సంవత్సరం నల్ల బర్లీ పొగాకు పండించిన రైతులు, కౌలు రైతులు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. కళ్ళ ముందు అన్నీ ఉన్నా తినడానికి మనసు రాని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులు, గాలులు, చిన్నచిన్న వర్షాల వల్ల మానసిక ధైర్యాన్ని కూడా కొద్ది కొద్దిగా కోల్పోతున్నారు.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు, సభ్య సమాజం మనకందరికీ అన్నం పెట్టే అన్నదాతలకు అండగా ఉండాలి. రైతాంగం కూడా ఒకరికొకరు చేయి కలిపి ఐక్యమై ఆందోళనే ఆయుధంగా పోరాడాలి. ఢిల్లీ రైతాంగ ఉద్యమ స్ఫూర్తితో ఐక్యంగా కదిలి నల్ల బర్లీ పొగాకు కనీసం గత సంవత్సరం రేటయినా సాధించుకోవాలి. ఆందోళన పోరాటాలలో రైతులు, కౌలు రైతులు పాల్గొని ప్రభుత్వాల మొండితనాన్ని, కంపెనీల దోపిడిని ఎదుర్కోవటానికి పోరాటమే పరిష్కారంగా ముందుకు రావాలి.


 వ్యాసకర్త : ఎం. హరిబాబుఎ.పి కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి /

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *