అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోవాలి.
తాడేపల్లి రూరల్ : వేసవికాలం అకాల వర్షాలకు పంటలు నేలకొరిగి దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోవాలని, ఏపీ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం బీభత్సమైన గాలులతో, అకాల వర్షం కురిసి, పంటలు దెబ్బతిన్న రైతులను పరామర్శించేందుకు, ఎంటిఎంసి పరిధిలోని కుంచనపల్లి గ్రామంలో రైతులను కలిసి నష్టపోయిన పంటల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శివ శంకరరావు మాట్లాడుతూ గత నెలలో అకాల వర్షం కురిసి పసుపు, మొక్కజొన్న పంటలు కల్లాలలోనే తడిసిపోయాయని అన్నారు. మరల నెలరోజుల వ్యవధిలోనే ఆదివారం కురిసిన అకాల వర్షాలకు తాడేపల్లి మండలం లోని వివిధ గ్రామాలలో అరటి గెలలతో సహా నేలకొరిగి అరటి వేసిన రైతులకు నష్టం వాటిలిందని అన్నారు. అదేవిధంగా మొక్కజొన్న పంట కూడా మొక్కజొన్నలకు బూజు పట్టి, దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. తక్షణమే మండలంలోని వ్యవసాయ అధికారులు పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని, పంటలు పూర్తిగా నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం అందేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు అమ్మిశెట్టి రంగారావు, అమ్మిశెట్టి శివ నాగేశ్వరరావు, కే హరీష్ తదితరులు పాల్గొన్నారు.