జయరామ్ చౌదరి ఆస్తులు జప్తు చేసి రైతులందరికీ వడ్డీతో సహా బకాయిలు చెల్లించాలి – ఎ.పి. రైతు సంఘం
ఐదు సంవత్సరాలుగా రైతులకు చెల్లించాల్సిన చెరకు బకాయిల చెల్లించకుండా అదృశ్యమైన జయరామ్ చౌదరిని ఎలాంటివాడు అన్నది ఇప్పుడు అందరికీ అర్థమైనది. రాజకీయ నాయకులను, కోర్టులను అడ్డం పెట్టుకొని రైతులపై తప్పుడు కేసులు వేసి వేధిస్తున్నాడు. ఇప్పటికైనా అతనిని జైల్లో పెట్టి అతని ఆస్తులు జప్తు చేసి రైతులకు న్యాయం చేయాలని ఏ.పీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె. రంగయ్య ,పి. హేమలత డిమాండ్ చేశారు.
ఐదు సంవత్సరాలుగా రైతులు అప్పులకు వడ్డీలు చెల్లించలేక, పిల్లల పెళ్లిళ్లు చేయలేక, చదివించలేక, నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఎన్నో పోరాటాలు చేసి, అధికారుల చుట్టూ తిరిగిన ఫలితంగా అతని ఆస్తులు వేలం వేసి కొంత డబ్బు చెల్లించారు. మిగతా డబ్బులు చెల్లించకుండా అతను స్టే తెచ్చి రైతులపై కేసులు వేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. అతన్ని బయట వదిలితే తిరిగి రాజకీయ పలుకుబడి, డబ్బు పలుకుబడి ఉపయోగించి డబ్బులు చెల్లించకుండా ఎగ్గొట్టే అవకాశం ఉన్నది. కాబట్టి రైతులకు న్యాయం చేయాలని అతనిపై ఉన్న కేసులు అన్నీ కూడా ముందుకు తెచ్చి రైతులకు న్యాయం చేయాలని ఎ.పి రైతుసంఘం గా డిమాండ్ చేస్తున్నాం.